Rakhi Shops are Crowded is Raksha Bandhan 2024 : సోదరసోదరీమణుల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లన్నీ రంగు రంగుల భిన్నమైన రాఖీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగినట్లు రూ.3 నుంచి రూ.3వేల దాకా వివిధ ధరల్లో రాఖీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లు వీటిలోనూ ప్రత్యేకతలు వచ్చేశాయి. తమ ప్రియమైన సోదరుల కోసం రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు. ప్రేమను పంచి బంధాన్ని పెంచుకోవడానికి రక్షా బంధన్ కోసం సిద్ధమవుతున్నారు.
మన ఆచారాలు, సంప్రదాయాల్లో దాదాపు ప్రతీ దాని వెనక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి పుట్టుకొచ్చినవే ఆచారాలు. సహజంగా పెళ్లైన తర్వాత ఆడపిల్లలు మెట్టినింట్లో తీరిక లేకుండా ఉండిపోతారు. ఎప్పుడో పండగలకు వచ్చిపోతారు. అది కూడా కొందరికి వీలు కాదు. రక్షా బంధన్కు మాత్రం తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి వారిచ్చే చిరు కానుకలు పొందేందుకు ఎంతో ఉత్సాహంగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వెళ్తారు. సోదరుల మణికట్టుకు కట్టే రాఖీ ద్వారా తోబుట్టువులతో తమ బంధం పదిలంగా ఉండాలని కోరుకుంటారు.